Raghunatha Reddy : టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత ..కొడుకు మరణించిన నెల రోజులకే తండ్రి కూడా
టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత ..కొడుకు మరణించిన నెల రోజులకే తండ్రి కూడా
Raghunatha Reddy : టాలీవుడ్ వెండితెరపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు కలకోట రఘునాథరెడ్డి గారి మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రఘునాథరెడ్డి గారి మరణం వెనుక ఒక గుండెను పిండేసే కథ ఉంది. కేవలం నెల రోజుల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతోనే మరణించారు.
కళ్ళముందే కొడుకు కన్నుమూయడంతో ఆయన తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. ఆ పుత్రశోకం నుండి కోలుకోలేక, నిరంతరం అదే ఆలోచనలో ఉండిపోయిన ఆయన, శనివారం (జనవరి 31) రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తండ్రీకొడుకులిద్దరూ నెల వ్యవధిలోనే ఒకే కారణంతో మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
సినీ ప్రస్థానం
1970, జనవరి 1న విజయవాడలో జన్మించిన రఘునాథరెడ్డి, సుమారు 350కి పైగా సినిమాల్లో సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు.శోభన్ బాబు హీరోగా నటించిన 'సర్పయాగం' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, మల్లీశ్వరి, తమ్ముడు, సంక్రాంతి, భద్ర, శ్రీరామరాజ్యం వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. 2018లో సుమంత్ నటించిన 'సుబ్రహ్మణ్యపురం' ఆయన చివరి చిత్రం.
రఘునాథరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన నటి శివపార్వతి టాలీవుడ్ స్పందనపై అసహనం వ్యక్తం చేశారు. వందలాది సినిమాల్లో నటించి, పరిశ్రమకు సేవలందించిన ఒక సీనియర్ నటుడు మరణిస్తే, సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన చెందారు.