Shaji N Karun: చిత్రపరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Update: 2025-04-29 01:32 GMT

Shaji N Karun: ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత, దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ కన్నుమూశారు. సోమవారం, ఏప్రిల్ 28, 2025న, ఆయన తిరువనంతపురంలోని వఝుతకాడ్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న షాజీ ఎన్ కరుణ్ ను తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. రెండు రోజుల క్రితం వఝుతకాడ్ లోని తన ఇంటికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో షాజీ ఎన్ కరుణ్ ను జెసి డేనియల్ అవార్డు 2023 తో సత్కరించారు. దర్శకుడు షాజీ ఎన్ మరణ వార్త వెలువడిన వెంటనే, దక్షిణ చిత్ర పరిశ్రమలో శోకసంద్రం నెలకొంది. ఈ వార్త అతని అభిమానులతో పాటు మొత్తం పరిశ్రమను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ సోషల్ మీడియా ద్వారా ఆయనను నివాళులు అర్పిస్తున్నారు.

జనవరి 1, 1952న కేరళలోని కొల్లంలో జన్మించిన షాజీ ఎన్ కరుణ్ క్యాన్సర్‌తో మరణించారు. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన చిత్రనిర్మాతలలో ఒకరైన షాజీ, పరిశ్రమలో తన కృషికి ప్రసిద్ధి చెందారు. 1989 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కెమెరా డి'ఓర్ - మెన్షన్ డి'ఆనర్‌ను గెలుచుకున్న తన మొదటి ఫీచర్ ఫిల్మ్ పిరవి (1988)తో అతను ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆయన దర్శకత్వం వహించిన 'పిరవి', 'స్వాహం' (1994) 'వానప్రస్థం' (1999) వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉన్నాయి. ఆయన అంత్యక్రియలు తైకాడ్‌లోని శాంతికవడమ్‌లో జరుగుతాయి. ఆయనకు భార్య అనసూయ దేవకి వారియర్, కుమారులు అప్పు, అనిల్ ఉన్నారు.

Tags:    

Similar News