Jr.NTR: జూ.ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. స్పందించిన తారక్
Jr.NTR: శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్, ఏపీకి చెందిన శ్యామ్అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్ ఈనెల 25 అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్తో పలుసార్లు కోసుకుని, అక్కడే ఉరివేసుకున్న స్థితిలో శ్యామ్ మృతదేహం కనిపించింది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా నమోదుచేసి మృతదేహానికి పోస్ట్మార్టం కూడా నిర్వహించారు.
అయితే ఎన్టీఆర్ అభిమానిగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల్లో మంచి గుర్తింపు ఉన్న శ్యామ్ అనుమానాస్పదంగా చనిపోవడంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్యామ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం మీద నారా లోకేష్, చంద్రబాబు వంటి వారు ప్రభుతం నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో స్పందించారు.
తన అభిమాని మృతిపై జూనియర్ ఎన్టీఆర్ లేఖ రిలీజ్ చేశారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అన్నారు. శ్యామ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అనుమానస్పద రీతిలో మృతిచెందిన శ్యామ్ స్వస్థలం గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట అయినా కుటుంబం చాలా కాలం నుంచి తిరుపతిలో ఉంటున్నారు.