Tollywood Drugs Case: ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్న రానా దగ్గుబాటి

Tollywood Drugs Case: హవాలా కోణంలో రానాను ప్రశ్నించనున్న అధికారులు * హీరో నందును 8 గంటల పాటు విచారించిన ఈడీ

Update: 2021-09-08 04:06 GMT

రానా దగ్గుబాటి (ఫైల్ ఇమాజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో సినీ నటుల ఇంటరాగేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, హీరోయిన్లు ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లను ఈడీ అధికారులు విచారించారు. నిన్న ఈడీ ఎదుట నటుడు నందు హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల ముందుగానే విచారణకు వస్తానని ఈడీ అధికారులకు కోరాడు. వారు అంగీకరించడంతో నిన్న విచారణకు హాజరయ్యాడు నందు. దాదాపు 8 గంటల పాటు ఇంటరాగేషన్‌ సాగింది.

నందును పలు విధాల విచారించారు ఈడీ అధికారులు. ప్రధానంగా మనీ ల్యాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎఫ్‌ క్లబ్‌తో ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. నందు బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఈడీ.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ సమక్షంలో నందును విచారించారు. కెల్విన్‌కు నందు ఖాతా నుంచి నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో.. ఆయా కోణంలో విచారణ చేపట్టింది ఈడీ.

ఇక.. ఇవాళ ఈడీ ముందుకు దగ్గుబాటి రానా హాజరుకానున్నారు. 2017 విచారణ జాబితాలో రానా పేరు లేదు. కానీ.. నవదీప్‌కు చెందిన ఎఫ్‌ క్లబ్‌కు రానా తరచూ వెళ్లేవారని, ఈడీ అధికారులు సమాచారం రాబట్టారు. పలు ట్రాన్జాక్షన్లు చేసినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. హవాలా కోణంలో రానా విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. రేపు హీరో రవితేజతో పాటు.. ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

Tags:    

Similar News