ఓట్ల తొలగింపు అంశాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేసేందుకు ఢిల్లీ పయనమయ్యారు వైసీపి అధినేత జగన్. గత ఏడాది నుండి రాష్ట్రంలో వైసీపి టార్గెట్ గా ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల సమయంలో తమకు నష్టం జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపద్యంలో ఢిల్లీ వెల్లిన జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది నుండి తమ పార్టీకి చెందిన వారి ఓట్లు తొలగిస్తున్నారంటూ అనేక సార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ ఏపిలో నిత్యం ఓట్ల తొలగింపు ఘటనలు తెరపైకి రావడంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు జగన్. ఇటీవల విజయనగరం, కడపలో సర్వేల పేరుతో ఓట్లు తొలగించడాన్ని పసిగట్టిన వైసీపి నేతలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు గతంలోనూ తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, విజయవాడలోనూ ఓట్ల తోలగింపు ఘటనలపై వైసీపీ అనేక ఆందోళనలు చేసింది. ఈ నేపద్యంలో ఓట్ల తొలగింపు అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం డిల్లీ చేరుకున్న జగన్ ఫిబ్రవరి 4న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఈసీని కలసి ఫిర్యాదు చేయనున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ బేటీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపద్యంలో ఏపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దీనికి తోడు ప్రత్యేక హాదా, విభజన హామీల అంశాలు అమలు అంశం మరో సారి రాష్ట్రంలో తెర మీదకు వచ్చింది. ఈ నేదప్యంలో ఈ అంశాన్ని ముందు నుండి పోరాటాలు చేస్తున్న వైసీపీ మరోసారి ఢిల్లీలో పలు పార్టీల పెద్దలను కలిసి తమ వాదనను వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైతే రాష్ట్రపతి, కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి అవకాశం కూడా ఉంది. ఇక కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందంటున్నా వైసీపీ మరోసారి పునరాలోచించాలని ఆర్ధిక శాఖ మంత్రిని కోరే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.