విశాఖ జిల్లాలోనే టీడీపీకి కంచుకోట నర్శీపట్నం నియోజకవర్గం దశబ్దాల నుంచి ఈ సెగ్మెంట్లో పసుపు జెండాకు ఎదురేలేదు. మంత్రి అయ్యనపాత్రుడు ఇలాకానాలో ఈసారి మాత్రం, పోరు హోరాహోరీగా సాగింది. మరి నర్సీపట్నంలో ఎగరబోయేది ఏ జెండా పోలింగ్ సరళి, సామాజిక సమీకరణాల సంకేతాలేంటి?
విశాఖపట్నం జిల్లా నర్శీపట్నం నియోజకవర్గం. కాకలు తీరిన రాజకీయానికి పెట్టింది పేరు. నర్సీపట్నం రాజకీయం సంకుల సమరం. సామాజిక సమీకరణలే శాసిస్తాయిక్కడ. అంతేకాదు కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ నర్సీపట్నం. దశాబ్ధాల నుంచి ఇక్కడ ప్రజలు టీడీపీకే మొగ్గు చూపుతున్నారు. 2,10,275 మంది ఓటు హక్కు కలిగివున్నారు. వారిలో 1,02,424 మంది పురుషులు, 1,21,336 మంది మహిళలు వున్నారు. నాతవరం, గోలుగొండ, మాకవరపాలెం, నర్శీపట్నం మండలాల సమాహారం నర్సీపట్నం.
1978 నుండి 2019 వరకు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, కేవలం 1978,1989,2009 మూడు పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్ గెలవగా, ఏడుసార్లు ఏకగ్రీవంగా టీడీపీ విజయ బావుటా ఎగరవేసింది. ప్రధానంగా గో పాత్రుడు, అయ్యనపాత్రుడు కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తూ వచ్చింది. 2009 ఎన్నికల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కాంగ్రెస్ అభ్యర్ధి బోళేం ముత్యాల పాప గెలుపొందారు. తరువాత 2014లో టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు 2,338 ఓట్ల మెజరాటీతో గెలుపొంది మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయ్యనపై వైసీపీ నుండి పోటీ చేసిన పెట్ల ఉమాశంకర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం జరగిన 2019 ఎన్నికలో కూడా టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు, వైసీపీ నుంచి పెట్ల ఉమా శంకర్ మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ ఎప్పుడూ మూడో అభ్యర్ధి పోటీకి నిలవకపోవడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అనేక పదవులు నిర్వర్తించి ప్రజలకు సేవ చేసిన అయ్యనపాత్రుడు సీనియారీటీకి ప్రజలు పట్టం కడతారో, లేక జగన్ ప్రభంజనంతో వైసీపీ అభ్యర్ధిగా బరిలో వున్న ఉమా శంకర్ను గెలిపిస్తారోనన్న చర్చ, నర్సీపట్నంలో జోరుగా సాగుతోంది.