ఇంటర్ సమస్యను విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిప్పులు చెరిగారు. ఇంటర్ వివాదాన్ని రావణకాష్టంలా రగిలిస్తూ విద్యార్ధులను ఆత్మహత్యల వైపు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరీరా సంస్థకు టెండర్ దక్కితే ఇప్పుడు ఆ తప్పులను తనకు అంటగట్టడం ఎంతవరకు సబబు అన్నారు. నాలుగున్నర కోట్ల రూపాయల టెండర్లో 10వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. సమస్య సున్నితమైనది కనుకే, తామంతా సంయమనం పాటించామని, విపక్షాలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధం లేదని పెద్దమ్మ తల్లిపై ఒట్టేసి చెప్పాలంటూ కాంగ్రెస్ సీనియర్ వీహెచ్ చేసిన సవాలుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓ బఫూన్ పెద్దమ్మగుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే తాను వెళ్లాలా అంటూ సెటైర్లు వేశారు. ఇకపై ఎవరైనా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే, పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.