గురువారం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా...సిట్టింగుల్లో ఎంతమందికి అవకాశం..?
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 16 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న కేసీఆర్ ఎవరెవరికి టిక్కెట్లు దక్కుతాయనే దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు మార్పులుంటాయనే సంకేతాలు రావడంతో సిట్టింగుల్లో సైతం భయం వెంటాడుతోంది.
ఇప్పుడూ అప్పుడూ అనుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు గురువారం విడుదల కానుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకేసారి 16 మందిని ఒకేసారి ప్రకటిస్తామన్న కేసీఆర్ అభ్యర్థి ఎవరైనా దీవెనలు అందించాలని 16 సీట్లకు 16 మందిని గెలిపించాలని ప్రజలను కోరారు.
అయితే ఇన్నాళ్లూ ఎంపీ అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కేసీఆర్ మొత్తానికి అభ్యర్థుల జాబితాను రూపొందించారు. అయితే అందులో సిట్టింగులు ఎంతమందికి మరోసారి అవకాశం ఉంటుందనే దానిపై వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో మార్పులుంటాయనే సమాచారం వారిలో కలవరం పెడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి హేమా హేమీలంతా బరిలో నిలవడంతో వారిని ఎదుర్కొనేందుకు బలమైన నాయకులు అవసరం అనే యోచనలో ఉన్న కేసీఆర్ జాబితా రూపకల్పనకు ఎక్కువ సమయం తీసుకున్నారని చెబుతున్నారు.
ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి బరిలో నిలవడంతో ఆయన్ని ఢీ కొట్టే వారెవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బలమైన నాయకుడినే బరిలోకి దించుతారనే ప్రచారం సాగుతోంది. అలాగే నల్గొండ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా బలంగా ఉండటంతో ఆయా స్థానాల్లో కూడా సరైన అభ్యర్థులను దించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పాలమూరు పోరు కూడా ఈ సారి రసవత్తరం కావడంతో మహబూబ్నగర్ టిక్కెట్పై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ సిట్టింగ్ అయిన సికింద్రాబాద్ స్థానంపై టీఆర్ఎస్లో కాంపిటీషన్ పెరగడంతో ఆ స్థానంలో ఎవరు నిలుస్తారో అనేది గురువారం తేలనుంది.
ఇక కొందరు అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఇదివరకే భరోసా ఇచ్చారు. అందులో కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన వినోద్ టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేశారు. ఏదేమైనా కొత్తముఖాలెంత మంది..? సిట్టింగుల్లో లక్ ఉన్నవారెంత మంది అనేది గురువారం ప్రకటించే జాబితాతో తెలియనుంది.