కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ స్థానాలలో ఒకటైనా వయనాడ్ నియోజకవర్గం కేరళ రాజధాని తిరువనంతపురానికి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.వయనాడ్ లో వ్యవసాయం, ఉద్యానవనాలే ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులు. తమిళనాడులోని నీలగిరి, థేని జిల్లాలు, కర్ణాటకలోని పాత మైసూరు ప్రాంతం, చామరాజనగర లోక్సభ నియోజకవర్గం సరిహద్దులో వయనాడ్ ఉంది.వయనాడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నీలంబూర్, వండూర్, ఎరనాడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. తిరువెంబడి సెగ్మెంట్ పరిధిలో ముస్లిం, క్రైస్తవుల జనాభా సరిసమానంగా ఉంటుంది. ఇక్కడి నుంచి రాహుల్గాంధీ పోటీచేయడం వల్ల.. కేరళలోని యూడీఎఫ్తోపాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపొచ్చని, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి పునర్వైభవం తేవొచ్చనేది కాంగ్రెస్ వ్యూహం.
గత రెండు లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాస్ విజయం సాధించారు. గతేడాది నవంబరులో మరణించడంతో ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంది. కేరళలో వామపక్షాలు పట్టు కోల్పోతున్నాయి. అదే సమయంలో ఆ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ కేరళ లోని వయనాడ్లో పోటీచేయడంతో కేరళతో పాటు దక్షిణాది ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు కలిస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.