తమ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా ఉన్నారని, ఆయనను విడుదల చేయాలని తామూ భావిస్తున్నామని.. కాకపోతే తమ ప్రధాని కోరినట్లు చర్చలకు అంగీకరిస్తే అభినందన్ను విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సంకేతాలిస్తూ పాక్ బ్లాక్మెయిలింగ్కు దిగింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్ముద్ ఖురేషి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వాదనను నిజం చేస్తున్నాయి. భారత పైలట్ను తిరిగి అప్పగించేందుకు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి పైలట్ విడుదల నాంది పలుకుతుందని భావిస్తే అలానే చేస్తామని ఖురేషి చెప్పారు. అయితే ప్రధాని మోడీ చర్చలకు సిద్ధంగా ఉంటే తమ ప్రధాని ఇమ్రాన్ చర్చించడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. అభినందన్ను విడుదల చేయాలంటే చర్చలు తప్పనిసరి అనే అభిప్రాయాన్ని పాక్ వ్యక్తం చేస్తోంది.