ఆంధ్రా అక్టోపస్..మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ సాయంత్రం మీడియా ముందుకు వస్తున్నారు. ఎప్పుడూ తన సర్వేల ఫలితాలతో ప్రజల్లో ఇమేజ్ తెచ్చుకున్న ఆయన..ఈ మధ్య తెలంగాణ ఫలితాల అంచనా సమయంలో మాత్రం దెబ్బ తిన్నారు. ఇక, ఏపీ ఫలితాలతో పాటుగా జాతీయ రాజకీయాల గురించి మే 19న సాయంత్రం సర్వే వివరాలు ప్రకటిస్తానని గతంలోనే లగడపాటి ప్రకటించారు.
అయితే, అనూహ్యంగా ఈ సాయంత్రమే అమరావతిలో లగడపాటి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. 19న ప్రకటించాల్సిన సర్వే ఫలితాలు ఈ రోజే ప్రకటించటానికి ఎన్నికల సంఘం అనుమతించే అవకాశం లేదు.రే పు ఏపీలోనూ రీ పోలింగ్ ఉంది. దీంతో..నేరుగా ఫలితాలు ప్రకటించే అవకాశాలు తక్కువగా ఉన్నా.. ఆయన ఏపీలో ఫలితాల గురించి టీజర్ తరహాలో తన సర్వే హైలైట్స్ వివరించే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా ఏపీలో ఫలితాలు ఏరకంగా ఉంటాయో సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనూ లగడపాటి ఇదే విధంగా చేసారు. ఎన్నికల్లో ఫలితాల అంచనాలు అంటూ ముందుగానే తన అభిప్రాయలను మీడియాలో షేర్ చేసుకున్నారు. తొలుత స్వతంత్ర అభ్యర్దులు గెలుస్తారని చెప్పటంతో ప్రారంభించి..ఆ తరువాత టీఆర్యస్కు వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయంటూ విశ్లేషణలు చేసారు. వీటి పైన అప్పట్లోనే టీఆర్యస్ నేతలు లగడపాటి పైన మండిపడ్డారు.
తెలంగాణ ఫలితాలు లగడపాటి అంచనాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఆ తరువాత కొద్ది రోజులు స్పందించని లగడపాటి తరువాకి కాలంలో తెలంగాణ ఫలితాలు ఎందుకు తప్పాయో చెబుతానని వివరించారు. ఇక, ఈ రోజు సాయంత్రం ఏపీ ఎన్నికల ఫలితాల గురించి తన అభిప్రాయలను వెల్లడించటంతో పాటుగా తెలంగాణలో తన అంచనాలు ఎందుకు తప్పాయో వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.