ఏన్డీయే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏన్డీయే కూటమికి 150 సీట్లు వచ్చేది కష్టమేనని అన్నారు. కాంగ్రెస్కు 100 నుంచి 110 సీట్లు వస్తాయన్నారు. ఈ రెండు కలిపితే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని రేపటి రోజున మొత్తం 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే ఢిల్లీ గద్దె మీద మనం కీలకం కాబోతున్నామని కేటీఆర్ తెలిపారు.
తద్వారా ఎవరూ ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే శక్తి మనకు ఉంటుందన్నారు. రాహుల్, మోదీ దొందూ దొందే అని ప్రజలకు తెలిసిపోయింది. వీరిద్దరూ ఎద్దెవా చేసుకున్నదే తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు. ఢిల్లీలో ప్రబలమైన శక్తిగా ఉంటే తప్ప మన హక్కులు సాధించుకోలేం. మన 16 మంది ఎంపీలకు మరికొంత మంది తోడు అవుతారనే నమ్మకం ఉందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్ని కలిసి 70 స్థానాలకు తగ్గకుండా 100 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి. మొత్తంగా 100 స్థానాలతో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉంది. కేసీఆర్ లాంటి మేధోసంపత్తి గల నాయకుడు ఏ విధంగానైతో తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారో ఆ విధంగా కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కేసీఆర్కు మద్దతుగా నిలుస్తాయి. దీంతో ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ కీలకం కానుందని కేటీఆర్ స్పష్టం చేశారు.