నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రచారం ఉధృతమైంది. దాంతో టీడీపీ జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూఖ్ అబ్దుల్లా, ఆప్ కన్వీనర్ అండ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఏపీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ముఖ్య నేతలను ప్రచారానికి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
మంగళవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల పట్టణంలో రోడ్షోలో సీఎం చంద్రబాబు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా పాల్గొని శ్రీనివాస సెంటర్లో ప్రచార రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సాయంత్రం 6 గంటలకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్కు హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం సర్కిల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి కర్నూలులో బస చేస్తారు. 27న ఉదయం కర్నూలు నుంచి బయలుదేరి 10.30కు ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్ షోలో పాల్గొని మాచాని సోమప్ప సర్కిల్లో ప్రసంగిస్తారు. 28న ప్రచార క్యాంపెయిన్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏపీకి రానున్నారు. 31న జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు శరద్పవార్ రాష్ట్రానికి రానున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.