ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువు గుట్టు రట్టు
ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం బట్టబయలైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు త్రిపురాంతకంలో భారీగా నిల్వ ఉంచిన ఎరువుల బస్తాలను గుర్తించారు.
ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం బట్టబయలైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు త్రిపురాంతకంలో భారీగా నిల్వ ఉంచిన ఎరువుల బస్తాలను గుర్తించారు. ప్రముఖ కంపెనీ అయిన ఐపీఎల్ పేరుతో నకిలీ ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. గతంలో గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై విచారణ చేపట్టగా దాని మూలాలు త్రిపురాంతకం మండలంలో దొరికాయి. సోమేపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో మూడు చోట్ల మొత్తం 624 బస్తాల నకిలీ పొటాషియం ఎరువుల బస్తాలను సీజ్ చేశారు. వ్యవసాయ అధికారులతో పాటు ఐపీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఎరువులను పరిశీలించగా అది నకిలీదని తేలిపోయింది. ఉప్పుకు రంగు కలిపి పొటాష్ పేరుతో ఎరువును తయారుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలోని మైసూర్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు.