కేంద్రమాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతిలో చంద్రబాబుతో సమావేశం అయిన ఆయన టీడీపీలో చేరేందుకు సమ్మతించారు. దీంతో కిశోర్చంద్రదేవ్కు పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రజా వేదికకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కిషోర్ చంద్రదేవ్తోపాటు మాజీ ఎమ్మెల్యేలు గోమాంగో, జయమణి కూడా టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉందని అందుకే పార్టీ మార్పు కోరుకున్నానని ఆయన చెప్పారు. బీజేపీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని అందుకు తెలుగు దేశం పార్టీయే సరైన వేదిక అని నిర్ణయించుకున్నానని అన్నారు. జిల్లాలోని అశోక్గజపతిరాజుతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.