తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ టూర్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాశంగా మారింది. శారదా పీఠంలో నిర్వవహించనున్న అష్టబంధన మహకుంభాభిషేక మహోత్సవానికి ఈనెల 14న హాజరు కానున్నారు. శారదా పీఠంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరవుతున్న కేసీఆర్ ఇదే సమయంలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ గృహ ప్రవేశానికి హాజరవుతారా ? లేదా అన్నది సస్పెన్స్గానే ఉంది.
రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కెసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా పర్యటనకు వెళ్లిన కెసీఆర్ మొదట విశాఖ శారదా పీఠం సందర్శనతో మొదలు పెట్టారు. విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. స్వామి స్వరూపానందేంద్ర ఆశిస్సులు తీసుకొని ఓడిషా, కోల్ కతా ఢిల్లీ టూర్ కు వెళ్లారు. పర్యటన ముగించుకొని వచ్చిన కొద్దిరోజులకే స్వామి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో చండీయాగం నిర్వహించారు.
ప్రస్తుతం విశాఖ శ్రీ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో ఈనెల 10వ నుండి 14వ తేదీ వరకు పీఠంలో అష్ఠబంధన మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కుంభాభిషేకానికి వివిధ రాష్ట్రాలనుండి వేదపండితులు హాజరవుతున్నారు. ఈ మహోత్సవం 10వ తేదీన గణపతి పూజతో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సుమారు150 మంది ఋత్వికులచే మహా క్రతువు నిర్వహిస్తున్నారు విశాఖ శారదా పీఠంప్రాంగణంలో గల దేవతామూర్తులకు విశేషపూజలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా రాజశ్యామల మహాయాగం చేపట్టడంతో యాగ పూర్ణాహూతి కార్యక్రమానికి కేసీఆర్ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారు.
అయితే మరోసారి విశాఖ వెళ్తున్న కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ తో భేటీ పై గులాభి వర్గాలు నోరు మెదపడం లేదు. కేసీఆర్ జగన్ ను కలుస్తారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అటు వైసీపీ నేతల్లోనూ ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతల్లోనూ కేసీఆర్ ఏం చేస్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో కేసీఆర్ విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన కొద్ది రోజులకే వైసీపీ అధినేత జగన్ సైతం పీఠాన్ని సందర్శించారు. అయితే స్వరూపానందేంద్ర నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానిని వివిధ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ నేపద్యంలో జగన్ కూడా ఆహ్వానించి ఉంటారనే చర్చజరుగుతోంది. ఒక వేళ జగన్ విశాఖకు వస్తే అక్కడే కేసీఆర్ తో జగన్ భేటీ అయ్యే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.
గత విశాఖ టూర్ లో కేసీఆర్ కు అక్కడ ప్రజలు వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలకడం తో ఈసారి కేసీఆర్ పర్యటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేసీఆర్ అక్కడి రాజకీయాలపై స్పందిస్తారా లేకా పీఠంలో జరిగే కార్యక్రమాలపై పరిమితమౌతారా అన్నది చూడాలి.