Israel Iran War : ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ మారణహోమం.. 48 మంది అగ్రనేతలు ఖతం

ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ మారణహోమం.. 48 మంది అగ్రనేతలు ఖతం

Update: 2026-03-02 00:57 GMT

Israel Iran War : ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఉమ్మడిగా జరుపుతున్న మెరుపు దాడులు పశ్చిమ ఆసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్, CNBC ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ.. ఈ సైనిక చర్య తాము ఊహించిన దానికంటే చాలా వేగంగా సాగుతోందని, ఇరాన్ నాయకత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఒకే ఒక్క ఆపరేషన్‌లో దాదాపు 48 మంది ఇరాన్ అగ్రనేతలను మట్టుబెట్టినట్లు ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు డజన్ల కొద్దీ సీనియర్ కమాండర్లు హతమయ్యారు. పెంటగాన్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రస్తుతం దాడుల తర్వాతి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ ఇప్పుడు పూర్తిగా బలహీనపడిందని, చర్చలకు సిద్ధంగా ఉందనే సంకేతాలు అందుతున్నాయని ట్రంప్ తెలిపారు. అయితే ఈ చొరవను ఇరాన్ ముందే తీసుకుని ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ భారీ ఆపరేషన్‌లో అమెరికా తన అత్యాధునిక B-2 స్టీల్త్ బాంబర్లను ప్రయోగించడం గమనార్హం. మొత్తం నాలుగు B-2 బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ఇరాన్ చేరుకుని, అక్కడి భూగర్భ బాలిస్టిక్ మిసైల్ కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. ఈ విమానాలు ఒక్కొక్కటి 2,000 పౌండ్ల బరువున్న శక్తివంతమైన బాంబులను డజన్ల సంఖ్యలో ఇరాన్ స్థావరాలపై కురిపించాయి. భూమి అంతర్భాగంలో దాచిన క్షిపణులను కూడా ధ్వంసం చేసే సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా కూడా ఈ భీకర దాడుల్లో స్టీల్త్ బాంబర్ల వినియోగాన్ని ధృవీకరించింది.

మరోవైపు, ఈ యుద్ధంలో అమెరికా కూడా ప్రాణనష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అమరవీరుల కుటుంబాలకు సమాచారం అందించిన తర్వాతే వారి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యుద్ధ భూమిలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, దాడులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు కూడా ఈ దాడులపై ఉద్వేగభరిత ప్రకటన చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున తాము దాడులు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇవి మరింత ఉధృతం అవుతాయని ఆయన హెచ్చరించారు. "గత 40 ఏళ్లుగా నేను దేనికోసం ఎదురుచూశానో, అది ఇప్పుడు అమెరికా సహకారంతో సాధ్యమైంది. ఉగ్ర పాలనపై మేము గట్టిగా దెబ్బకొడుతున్నాం. మా భవిష్యత్తు కోసం, మా ఉనికి కోసం IDF తన పూర్తి శక్తిని ఉపయోగిస్తోంది" అని నెతన్యాహు స్పష్టం చేశారు.

Tags:    

Similar News