వైద్యో నారాయణో హరి అంటారు. సాధారణ సమయాలతో పోలిస్తే ప్రాణాంతక వైరస్ లు ప్రబలే సమయాల్లో వైద్య సిబ్బంది ప్రాధాన్యం మరింతగా ఉంటుంది. ప్రాణాలను కాపాడే వారి ప్రాణాలకు మరింత విలువనివ్వాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారి ప్రాణాలే ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వైద్యసిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల కనీస ధర్మం. అయితే వారికి అవసరమైన సామాగ్రిని అందించకపోగా, నిరసన తెలిపిన డాక్టర్లు, వైద్యసిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేసింది పాకిస్తాన్లోని బలుచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం.
కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు వారికి రక్షణ పరికరాలు (పీపీఈ)ను అడిగారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో వారు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు అక్కడనుండి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది.. అదేమంటే 'పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమే, అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్ను ఉల్లంఘించారు. అందుకే ఆరెస్ట్ చేశాం'అని బలుచిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక డాక్టర్లపై లాఠీచార్జ్, అరెస్ట్ చేయడంపై అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో డాక్టర్లను కాపాడుకోవాల్సింది పోయి ఆరెస్ట్ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.