కరోనావైరస్ అభివృద్ధి ఎలా జరిగిందో చెప్పాలని అమెరికా చైనాను నిలదీసింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో డెవలప్ అయిందా? లేక వుహాన్లో ఉన్న మాంసాహార మార్కెట్లోనా? ఎక్కడ? అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ ప్రశ్నించారు. వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత చైనాదే వారేం చేస్తారో జాగ్రత్తగా పరిశీలిస్తామని రాబర్ట్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. చైనాపై పూర్తిస్థాయి విమర్శలు చేస్తున్న అమెరికా విమర్శలకు మరింత పదును పెట్టింది. చైనాలో రెండు ల్యాబ్లున్నాయని అక్కడ కీలక పరిశోధనలు జరిగినట్లు సమాచారముందని రాబర్ట్ ఓబ్రెయిన్ తెలిపారు. అక్కడ ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలని రాబర్ట్ డిమాండ్ చేశారు.
ఇప్పటికే అమెరికాలో కోర్టు కేసులు దాఖలయ్యాయని నిజానిజాలు బయటకు రావాలని అనేక దేశాలు కోరుతున్నాయని రాబర్ట్ ఒబ్రెయిన్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు భజనబృందంగా మారిందని ఆయన విమర్శించారు. వైరస్ గురించి మొదట ప్రపంచానికి తెలియజెప్పిన విజిల్బ్లోయర్లు అదృశ్యమయ్యారని మీడియా గొంతు నొక్కేసి తరిమేశారని రాబర్ట్ ఒబ్రెయిన్ గుర్తుచేశారు. పశ్చిమదేశాల నుంచి సాంక్రమిక వ్యాధుల నిపుణులను పంపుతామంటే తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు.
కరోనావైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని ఆరోపిస్తూ అమెరికాలోని మిసోరి రాష్ట్రం ఓ దావా వేసింది. ఇలా వ్యాజ్యం వేసిన తొలి రాష్ట్రం మిసోరీయే కరోనా గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి. విజిల్బ్లోయర్లను అరెస్ట్ చేసి, ఈ మహమ్మారి గురించి తెలియజెప్పడానికి నిరాకరించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలమంది మరణాలకు చైనా కారణమైందని మిసోరి అటార్నీ జనరల్ ఎరిక్ ష్మిట్ అక్కడి డిస్ట్రిక్ట్ కోర్టులో వేసిన వ్యాజ్యంలో తప్పుపట్టారు. వైరస్ ప్రబలిన తొలినాళ్లలో చైనా అక్కడి ప్రజలను మోసం చేసిందని ఇది ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి పాకుతుందని చెప్పలేదని అటార్నీజనరల్ తన పిల్లో ప్రస్తావించారు. పక్కా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా వాటిని బుకాయిస్తూ వచ్చిందని కీలకమైన వైద్య పరిశోధనను ధ్వంసం చేసిందని పిల్లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి ఇది సోకేట్లు చేసిందని ఆ దావాలో ఘాటుగా విమర్శించారు. చేసిన నిర్వాకానికి చైనా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.