Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల వేళ దారుణం: బీఎన్పీ నేత అజీజుర్ ముసబ్బిర్ కాల్పుల్లో మృతి
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల ముంగిట హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల ముంగిట హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. తాజాగా ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి చెందిన కీలక నేత అజీజుర్ ముసబ్బిర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.
ఢాకాలోని కర్వాన్ బజార్ వద్ద ఉన్న ఒక హోటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు అజీజుర్ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుండి కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా గాయపడగా, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
ఎవరీ అజీజుర్ ముసబ్బిర్?
అజీజుర్ గతంలో బీఎన్పీ (BNP) అనుబంధ విభాగమైన 'ఢాకా మెట్రోపాలిటన్ నార్త్ స్వచ్ఛసేవక్ దళ్'కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలో చురుకైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ హత్యకు నిరసనగా బీఎన్పీ కార్యకర్తలు ఢాకా వీధుల్లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు భారీగా గుమిగూడటంతో, భద్రతా దళాలు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు వెల్లడించారు.