రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలో మోడీ సర్కార్ వ్యవసాయ రంగంలో మరో అడుగు ముందుకేసింది. దేశంలో వ్యవసాయ స్వరూపమే మార్చే దిశగా వ్యూహరచన చేసింది. వ్యవసాయానికి అవసరమైన సలహాలు, సూచనలతో పాటు ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీలను రైతాంగానికి పక్కాగా అందించే చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ఐదెకరాల లోపు ఉన్న రైతాంగానికి ఏడాదికి ఆరువేల ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యంతర బడ్జెట్ ఆర్థిక శాఖ ఇన్ఛార్జి మంత్రి పీయూష్గోయల్ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతరం బడ్జెట్లో కేంద్రం అన్నదాతలపై వరాల జల్లు కురిపించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చిన్న కారు రైతుల ప్రయోజనం ప్రవేశపెట్టిన ఈ పథకం వ్లల ప్రతీ రైతు కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు గోయల్.
మూడు విడతలుగా అన్నదాతకు ఆసరాగా ఉంటామన్న కేంద్రం నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు వెల్లడించారాయన. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై 75వేల కోట్ల రూపాయల అదనపు పడుతుందన్న గోయల్ ఈ పథకం 2018 డిసెంబర్ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధులాంటి పథకమే మొత్తానికి కేంద్రం కూడా ప్రవేశపెట్టడం విశేషం. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ 2 వేల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మూడు విడుతల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు.