భారత యుద్ధకౌశలాన్నే మార్చేసే, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పార్లమెంట్లో అట్టుడుకిస్తూనే ఉంది. మొన్న రాహుల్, అరుణ్ జైట్లీల వాగ్వాదం హీటెక్కిస్తే, తాజాగా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీల మధ్య డైలాగ్ వార్ హోరెత్తింది. రాఫెల్ ఒప్పందంపై దీర్ఘకాలంగా ఆరోపణలెదుర్కొంటున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో అపరకాళిక అవతారమెత్తారు. లోక్ సభలో కాంగ్రెస్ ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చారు. దాదాపు రెండు గంటల పాటూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక రేంజ్ లో చెలరేగిపోయారు. కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి రాహుల్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై అత్యంత ఘాటుగా, మునుపెన్నడూ లేనంత ఆవేశంతో స్పందించారు నిర్మలా సీతారామన్. ప్రధానిని పదే పదే చోర్ చోర్ అని సంబోధించడంపై మండిపడ్డారు. వ్యక్తుల పేర్లు తీసి, స్థాయి దిగజారి విమర్శలు చేస్తున్నారంటూ ఆవేశంతో ఊగిపోయారు.
ప్రధానిని ఫ్రెంచ్ ప్రధాని దొంగ అన్నారంటూ పదే పదే చెబుతున్న కాంగ్రెస్ అందుకు ప్రూఫ్ చూపాలని.. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దనీ హెచ్చరించారు నిర్మలా సీతారామన్. రాఫెల్ కుంభకోణంపై విమర్శలతో విసిగిపోయిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వాటన్నింటికీ బదులు తీర్చుకున్నారు.. తన వాదనని, రాఫెల్ ఒప్పందాన్ని విశ్లేషిస్తూ.. పాయింట్ టు పాయింట్.. సమాధానమిచ్చి పై చేయి ప్రదర్శించారు.. పార్లమెంటులో అద్భుతంగా మాట్లాడిన మహిళా నేతగా స్పీకర్ కితాబునందుకున్నారు నిర్మల.