ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కొన్ని నియోజకవర్గాల నుంచి బరిలోనిలిపిన అభ్యర్థులు 10వ తరగతి వరకూ చదివిన వారు మాత్రమే ఉన్నారు. గుడివాడ, గుంటూరు ఈస్ట్, కాకినాడ రూరల్, విజయవాడ వెస్ట్ లాంటి నియోజక వర్గాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కొందరు 10వ తరగతి వరకూ చదివినవారే కావటం విశేషం. అసలు చదువేలేని అభ్యర్థి నుంచి 10వ తరగతి ఫెయిలైన అభ్యర్థులు సైతం శాసనసభలో అడుగుపెట్టడానికి, చట్టాలు చేయటానికి తహతహలాడిపోతున్నారు.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్న మాటను అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు విశేషంగా ప్రచారం చేస్తున్నాయి. ఇల్లాలు చదువుకొంటే ఆ ఇంట్లో చీకటి తొలగి వెలుగుతో నిండిపోతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. చదువు ప్రాధాన్యం గురించి విస్త్రుతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే రాజకీయనాయకులు, శాసనకర్తలు కావాలంటే చదువు ఏమాత్రం అక్కరలేదని మన రాజకీయపార్టీలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు కొన్ని నియోజకవర్గాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను చూస్తే ధనబలం, కార్యకర్తల బలం ఉన్నంతస్థాయిలో చదువులేక పోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉత్తరాంధ్ర మినహా 10 జిల్లాలలో 30 మంది అభ్యర్థుల వరకూ అసలు చదువేలేని స్థాయి నుంచి 10వ తరగతి మాత్రమే చదివినవారు ఉండటం విశేషం. వీరిలో వైసీపికి చెందిన 19 మంది, టీడీపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఉన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బొల్లా బ్రహ్మనాయుడు...తన ఎన్నికల అఫిడవిట్ లో అసలు చదువేలేదని పేర్కొన్నారు. కనిగిరి నుంచి పోటీ చేస్తున్న బుర్రా మధుసూదనరావు ప్రాథమిక విద్యతోనే సమరానికి సిద్ధమయ్యారు. అంతేకాదు గుంటూరు ఈస్ట్ నుంచి పోటీకి దిగిన ముస్తాఫా విద్యార్హత కేవలం 6వ తరగతి మాత్రమే.
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న కొడాలి నాని 10వ తరగతి ఫెయిల్ అర్హతతోనే మరోసారి ఎమ్మెల్యే పదవికి గురిపెట్టారు.పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైసీపీ అభ్యర్ధి కారుమంచి నాగేశ్వరరావు కేవలం 7వ తరగతి విద్యార్హతతోనే పోటీకి దిగుతున్నారు.విజయవాడ వెస్ట్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 10వ తరగతి మాత్రమే చదివారు అధికార టీడీపీలోనూ పెద్దచదువుల్లేని అభ్యర్థులు పదిమంది వరకూ ఉన్నారు.
సత్యవేడు టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ విద్యార్హత 4వ తరగతి మాత్రమే.రామచంద్రాపురం టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన తోట త్రిమూర్తులు కేవలం 7వ తరగతి మాత్రమే చదివారు.ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీలో నిలిపిన మంతెన రామరాజు సైతం 9వ తరగతి విద్యార్హతతోనే ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
జగ్గంపేట టీడీపి అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ 9వ తరగతితోనే చదువు స్వస్తి పలికినా రాజకీయాలలో రాణిస్తూ వచ్చారు. మరోసారి ఎమ్మెల్యే స్థానానికి గురిపెట్టారు. కాకినాడ రూరల్ నుంచి పోటీలో నిలిచిన పిల్లి అనంతలక్ష్మి, , పిఠాపురం టీడీపీ అభ్యర్థి వర్మ 10వ తరగతి అర్హతతోనే పోటీలో నిలిచారు. ఉత్తరాంధ్ర మూడుజిల్లాలు మినహా ఏపీలోని 10 జిల్లాల్లో 10వ తరగతి చదివిన 30 మంది అభ్యర్థులు ఏమాత్రం చదువులేని స్థాయి నుంచి 10వ తరగతి చదువు మాత్రమే ఉన్నవారు కావడం విశేషం. భారత ప్రజాస్వామ్యంలోని అతిగొప్ప విషయం రాజకీయఅధికారాన్ని చెలాయించే ప్రజాప్రతినిధులకు ఏమాత్రం విద్యార్హత లేకపోవటమే.