బహుళ పంటల సాగుతో రైతాంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్న యువరైతు

Update: 2020-06-15 08:01 GMT

చేసే పని ఏదైనా.. ఉన్నతంగా చేయాలి. ఉత్తమంగా చేయాలి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తాం. ఇదే మంత్రాన్ని పునికిపుచ్చుకున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు గణేష్. రెండున్నర ఎకరాల్లో 15 రకాల పండ్ల పంటలు పండిస్తూ శభాష్ గణేష్ అనిపించుకుంటున్నాడు. బహుళ పంటల సాగుతో రైతాంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్న యువరైతుపై హెచ్ ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

రెండున్నర ఎకరాలు.. పదిహేను రకాల పండ్ల పంటల సాగు. దానిమ్మ ‌‌కాత‌ ముగిస్తే.. జామ పంట చేతికి ‌వస్తుంది. జామ పంట లూటీపోతే.. మరో పంట ఆదాయ వనరుగా మారుతుంది. భూమి నిండా పంట, చేతి నిండా ఆదాయం. ఇది ఆదిలాబాద్ యువరైతు సాగు సంబురం. వ్యవసాయం అతని కళ వ్యవసాయమే అతని తపన. ఆ తపనతోనే ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో పాఠాలు బోధిస్తూ మరోవైపు సొంత గ్రామమైన గుడిహథ్నూర్ మండలం బెళ్లూరిలో బహుళ పంటలు‌ సాగుచేస్తున్నాడు యువరైతు బోసరి గణేష్.

‌తనకున్నా ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో బహుళ పంటలు సాగు చేయాలని రైతు గణేష్ సంకల్పించారు. ప్రధానంగా జామ, శ్రీగంధం ‌మొక్కల సాగు చేపట్టారు. వీటి ‌మధ్య అంతర్ పంటలుగా బత్తాయి, సపోట, బాదం, మామిడి, జీడి మామిడి, ఫైన్ యాపిల్ , యాపిల్ బేర్, అంజీర్, యాపిల్, గ్రేప్స్ పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం జామ పంట చేతికి రావడంతో మార్కెట్లో అమ్మకాలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో దానిమ్మ వస్తుందని రైతు చెబుతున్నారు. ఒక సీజన్ ముగియగానే మరో సీజన్ లో వచ్చే పండ్లు చేతికి వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పత్తిలో కందిని అంతర్ పంట సాగు చేయడం చాలా మంది రైతులు ఇష్టపడరు. కానీ బహుళ పంటలు సాగు చేయడం వల్ల రైతులకు తోడ్పాటుగా నిలుస్తుందని అంటున్నారు రైతు గణేష్. పైగా శీతల ప్రాంతాల్లో పండే పంటలకు బహుళ పంటల సాగు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందంటున్నారు.

బహుళ పంటలు అనగానే చాలా మంది ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ గణేష్ ఎలాంటి ఖర్చు లేకుండా బహుళ పంటలను సాగుచేస్తున్నారు. కేవలం‌ సేంద్రియ ఎరువులు వాడుతూ అధిక లాభాలు పొందుతున్నారు. ఖర్చు తక్కువ, అధిక ప్రయోజనాలు ఉండే బహుళ పంటలు సాగు చేస్తే రైతుల ఇంటా కాసుల వర్షం ఖాయమని అంటున్నారు.


Full View


Tags:    

Similar News