విశాఖ మన్యం.. పనస సువాసనలతో గుబాళిస్తోంది. కమ్మని రుచితో రారమ్మంటూ ఆహ్వానిస్తుంది. పనసపళ్ల మజాను ఎంజాయ్ చేయాలంటే మన్యం బాటపట్టాల్సిందే. కానీ లాక్డౌన్తో పర్యాటకుల రాక, ఇటు మైదాన ప్రాంతం నుంచి పనస కొనుగోలు చేయడానికి ఎవరూ రాకపోవడంతో పంట పొలాలకే పరిమితమైంది. దీంతో గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు.
విశాఖ మన్యంలో పనస పండ్ల సీజన్ మొదలైంది. మన్యమంతా ఎటు చూసినా పనస పండ్ల గుబాళింపుతో గమ్మెత్తిస్తోంది. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో సుమారు 15 లక్షలకు పైబడిన పనస చెట్లు ఉన్నాయి. పనస చెట్లలో కబ్జా, బురద అనే రెండు రకాలు ఉంటాయి. బురద పనస పండ్లపై తొక్కను చేత్తో తీసి తినేందుకు వీలుగా, మెత్తగా ఉంటాయి. ఆరోగ్యానికి కజ్జా పనస మంచిదని చెబుతుంటారు. ఇక పనసలో తెల్ల పనస, ఎర్ర పనస, కొబ్బరి పనస, తేనే పనస అనే రకాలు కూడా ఉంటాయి. ఇందులో కొబ్బరి పనస తొన మందంగా కొబ్బరిలా ఉంటే తేనె పనసలో పది నుంచి పది హేను చుక్కల తేనె కూడా ఉంటుంది.
ఎన్నో బహుళ ప్రయోజనకారి అయిన మన్యం కల్పతరువు పనసను మరింత విస్తరించుకునే సమయంలో కరోనా కాటు వేసింది. లాక్డౌన్తో మైదాన ప్రాంతం నుంచి పంటను కొనుగోలు చేయడానికి ఎవరూ రాకపోవడంతో పంట పొలాలకే పరిమితమయ్యింది. దీంతో గిరిజన రైతులకు ఆదాయం తెచ్చే పనసపై కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో పడిందని గిరిజనులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మారకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.