Jobs in Hyderabad : స్విస్ బ్యాంక్ ఇప్పుడు మన హైదరాబాద్లో..3000 ఉద్యోగాలతో యువతకు బంపర్ ఆఫర్
స్విస్ బ్యాంక్ ఇప్పుడు మన హైదరాబాద్లో..3000 ఉద్యోగాలతో యువతకు బంపర్ ఆఫర్
Jobs in Hyderabad : హైదరాబాద్ ఐటీ హబ్లో మరో అంతర్జాతీయ దిగ్గజం అడుగుపెట్టింది. స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ గచ్చిబౌలి వేదికగా తన సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 11, 2026న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. రాబోయే రెండేళ్లలో ఈ సెంటర్ ద్వారా సుమారు 3,000 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్ నగరం గ్లోబల్ ఫిన్టెక్ హబ్గా వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయగా, ఇప్పుడు స్విస్ దిగ్గజం యూబీఎస్ కూడా తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. కేవలం గత ఏడాదే 1,800 ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పిన సంస్థ, ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 3,000కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఏయే విభాగాల్లో ఉద్యోగాలు?
ఈ కొత్త సెంటర్లో కేవలం సాధారణ బ్యాంకింగ్ పనులు మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డిజిటల్ ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్ల అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, డేటా అనలిస్టులను నియమించుకోనున్నారు. హైదరాబాద్లో ఉన్న అపారమైన టాలెంట్ పూల్ను ఉపయోగించుకుని తమ గ్లోబల్ టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేయాలని యూబీఎస్ భావిస్తోంది.
హైదరాబాద్పై ఎందుకింత నమ్మకం?
తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, నాణ్యమైన మౌలిక సదుపాయా, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కారణంగానే హైదరాబాద్ను ఎంచుకున్నట్లు యూబీఎస్ ప్రతినిధులు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. "యూబీఎస్ వంటి సంస్థలు తమ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇండియా-ఈయూ-స్విట్జర్లాండ్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయి. ఇది మన నగర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది" అని పేర్కొన్నారు.
గ్లోబల్ మార్కెట్లో యూబీఎస్ వ్యూహం
క్రెడిట్ సూయిస్ విలీనం తర్వాత యూబీఎస్ తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా పునర్వ్యవస్థీకరిస్తోంది. స్విట్జర్లాండ్లో కొన్ని ఉద్యోగ కోతలు జరుగుతున్నప్పటికీ, టెక్నాలజీ, ఆపరేషన్ల కోసం భారత్ను, ముఖ్యంగా హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం భారత్లో ముంబై, పూణేల్లో యూబీఎస్ ఆఫీసులు ఉండగా, హైదరాబాద్ సెంటర్ అత్యంత కీలకమైనదిగా మారబోతోంది.