ఇంటర్ విద్యలో పెద్ద మార్పులు – ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్, అన్ని సబ్జెక్టులకు అంతర్గత మార్కులు!
Telangana ఇంటర్ విద్యలో సంస్కరణలు! 2026–27 నుంచి ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్, అన్ని సబ్జెక్టులకు 20% ఇంటర్నల్ మార్కులు, కొత్త ACE గ్రూప్, సిలబస్ తగ్గింపు, QR కోడ్ పాఠ్యపుస్తకాలు – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు.
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యార్థులపై భారం తగ్గించడంతో పాటు, ప్రాక్టికల్ ఆధారిత పద్ధతిని ప్రోత్సహించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కొత్త మార్పులు 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
ముఖ్య నిర్ణయాలు – ఇంటర్లో కొత్త మార్పులు
ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్:
ఇప్పటి వరకు సెకండియర్లో మాత్రమే ప్రయోగ పరీక్షలు (Practicals) నిర్వహించేవారు. ఇకపై ఫస్టియర్లో కూడా ప్రాక్టికల్స్ తప్పనిసరి అవుతాయి.
అన్ని సబ్జెక్టులకు 20% అంతర్గత మార్కులు:
ఇంటర్లోని అన్ని సబ్జెక్టులకు 80% రాత పరీక్ష, 20% ఇంటర్నల్ మార్కులు విధానం అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇది కేవలం ఇంగ్లీష్కే వర్తించేది. ఇక నుంచి తెలుగు, సంస్కృతం, గణితం, సైన్స్ తదితర సబ్జెక్టులకూ వర్తిస్తుంది.
ప్రాక్టికల్స్ మార్కుల విభజన:
ప్రస్తుతం MPC గ్రూపులో భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 చొప్పున మార్కులు ఉన్నాయి. ఇకపై ఫస్ట్ ఇయర్లో 15, సెకండియర్లో 15 మార్కులు చొప్పున విభజిస్తారు.
BPC గ్రూపులో నాలుగు సబ్జెక్టులకు 120 మార్కుల ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిని 60 + 60 మార్కులుగా విడగొడతారు.
కొత్త గ్రూప్ – ACE (Accountancy, Commerce, Economics):
ప్రస్తుతం ఉన్న CEC (Civics, Economics, Commerce) గ్రూప్కి బదులుగా, ఎకౌంటెన్సీకి ప్రాధాన్యత ఇవ్వడానికి ACE గ్రూప్ను ప్రవేశపెడుతున్నారు.
సిలబస్ తగ్గింపు:
గణితం, భౌతిక, రసాయనశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో భారం తగ్గించనున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్ NCERT ప్రమాణాలకు మించి ఉంది, కాబట్టి దాన్ని జాతీయ ప్రమాణాలకు సమానంగా మార్చనున్నారు.
పాఠ్యపుస్తకాల్లో QR కోడ్లు:
ప్రతి పాఠ్య పుస్తకంలో QR కోడ్ ముద్రించి, విద్యార్థులు దానిని స్కాన్ చేయడం ద్వారా అదనపు సమాచారం, వీడియో లెక్చర్లు, ప్రాక్టీస్ మెటీరియల్ చూడగలరు.
రేవంత్ రెడ్డి సంస్కరణల లక్ష్యం
ఈ మార్పులతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గి, ల్యాబ్ ప్రాక్టికల్ అవగాహన పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా, మొదటి ఏడాదిలోనే ప్రాక్టికల్స్ ఉండటం వలన విద్యార్థులు సబ్జెక్టుల పట్ల మరింత ఆసక్తి కనబరుస్తారని భావిస్తున్నారు.