ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై దాడి కేసులో నిన్న(శుక్రవారం) కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. జగన్ కేసులో విచారణ జరిపిన ఏపీ పోలీసుల సహాయ నిరాకరణపై ఎన్ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్ఐఎ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ కు విధించిన ఎన్ఐఏ కస్టడీ గడువు ముగిసింది. దాంతో అధికారులు అతనికి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఎన్ఐఏ కోర్టులో హజరుపర్చటంతో కోర్టు అతనికి ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
కాగా శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత సరిగా లేదని అతడి తరపు న్యాయవాది సలీమ్ కోర్టుకు నివేదించారు. దీంతో శ్రీనివాసరావుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.