ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. ఈ ఘటన హైదరాబాద్ సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ నెల 1వ తేదీన రాత్రి దారుణహత్యకు గురైన రైల్వే గ్యాంగ్మెన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్కు చెందిన మూడ్ శ్రీనివాస్(45) రైల్వే గ్యాంగ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆయన బోరబండ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య సంగీత, ముగ్గురు పిల్లలున్నారు. భార్య సంగీత బీఈడీ పూర్తి చేసి ఎస్సై పరీక్షలో ఉతీర్ణురాలై ఎస్సై పోస్టుకు ఎంపికైంది. అయితే ఆమెకు శ్రీనివాస్ మేనల్లుడు విజయ్నాయక్(27) తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచూ విజయ్నాయక్..
శ్రీనివాస్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో సంగీత, విజయ్నాయక్ ల అనైతిక బంధం శ్రీనివాస్ కు తెలిసిపోయింది. దాంతో సంగీతను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా ఇద్దరినీ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి శ్రీనివాస్ను హత్య చేయాలని పథకం పన్నారు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన రాత్రి ఇంటికి వచ్చిన విజయ్నాయక్, సంగీతతో కలిసి బండరాయితో మోది శ్రీనివాస్ను హత్య చేశారు. మృతదేహాన్ని దోమల తెరతో పాటు బెడ్ షీట్లో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా రైలు పట్టాలపై పారవేశారు. మృతుడి సోదరుడికి సంగీతపై అనుమానం రావడంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసాడతను.. దాంతో విచారణ చేపట్టిన పోలీసులకు శ్రీనివాస్ ను హత్య చేసింది సంగీత, విజయ్నాయక్ అని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.