రంగుల ప్రపంచంలో మరో తార రాలిపోయింది. నటనలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్న నటి జీవితం మధ్యలోనే ముగిసిపోయింది. చిత్ర సీమలో నటి ఝాన్సీ మరణం మరచిపోక ముందే మరో తార ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని వడపళనిలో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యషిక.. తన ఆత్మహత్యకు ప్రేమికుడి కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్లో మెసేజ్ చేసింది. 'మన్నార్ వగెరా' సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు యషిక. పలు తమిళ సీరియల్స్లో నటించిన యషిక అసలు పేరు మేరీ షీలా జబరాని. గత కొంత కాలంగా అరవింద్ అలియాస్ మోహన్ బాబు అనే బిజినెస్మేన్తో యషిక సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరిమధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యషిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.