సోషల్ మిడియాలో తనపై అసభ్యకరమైన,అసత్య అరోపణలు వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ సోదరి, షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలిసులు విచారణ వేగవంతం చేశారు. సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు మొత్తం 15 సైట్లను గుర్తించారు. అందులో కొంతమందికి నోటీసులు జారీ చేయడం తోపాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం నిందితులుగా పరిగణించి నోటీసులు ఇచ్చారు. వీరంతా హైదరాబాదులో ఉంటున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. ఈ ఐదుగురూ సొంత యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
షర్మిల పై అసభ్యంగా మొత్తం 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ చాన్సల్స్కు సంబంధించినవో కనుగొనేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు. మరోవైపు యూట్యూబ్ చానల్లో వారు క్రియేట్ చేసుకున్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఉండవు. కాబట్టి ఆ వివరాలు ఇవ్వాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులు యూట్యూబ్కు లేఖ రాశారు. ఆ వివరాలు అందగానే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, వీడియో పోస్టు చేసిన వారితో పాటు దానికి కామెంట్ చేసినవారు కూడా నిందితులే అవుతారని పోలీసులు హెచ్చరించారు.