Nirbhaya case: నిర్భయ కేసులో నేరము-శిక్ష మధ్యలో ఎనిమిదేళ్ళు!

Update: 2020-03-20 02:05 GMT
Nirbhaya convicts (File Photo)

నిర్భయ కేసు.. అతి పెద్ద న్యాయ పోరాటం. ఒక నేరం.. దానికి పడే శిక్ష.. ఆ శిక్షను తప్పించుకోవడానికి దోషులు చేసే ప్రయత్నం ఇన్ని కోణాలను ప్రజలకు సుస్పష్టంగా.. ప్రత్యక్షంగా సుదీర్ఘంగా అనుభవంలోకి తెచ్చిన కేసు. నిస్సహాయంగా ఆర్థరాత్రి రాజధాని వీధుల్లో నిర్భయ చేసిన రోదనకు ఇప్పుడు న్యాయం జరిగింది. నిర్భయ లేకపోవచ్చు.. కానీ ఆమె రోదన ఇప్పుడు ఓ చట్టం అయింది. నిర్భయ అనంతలోకాలకు వెళ్లిపోయి ఉండవచ్చు.. అబలలను కబళించే నీచులకు పట్టే దుర్గతి ఎలా ఉండబోతుందో..దానికి చేయాల్సిన అలుపెరుగని న్యాయపోరాటం ఎలా చేయాలో స్పష్టంగా తెలియచెప్పింది. 

ఆఖరు వరకూ ట్విస్ట్ లతో సాగింది నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష. దాదాపు ఎనిమిదేళ్ళు పట్టింది. అడుగడుగునా ఎన్నో మలుపులు.. ప్రతి మలుపులోనూ దోషులు తప్పించుకోవడానికి చేసిన విశ్వ ప్రయత్నం. దానికి సహకరించిన వ్యవస్థలు. చట్టంలోని లొసుగులు.. ఇవన్నీ మన దేశ ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తినా.. అనుమానాలు కల్గించినా చివరకు న్యాయం గెలిచింది. ప్రజల మనోభీష్టం నెరవేరింది.

నిర్భయ కేసులో ఎప్పుడేం జరిగింది..

2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.

2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.

2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.

2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.

2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.

2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.

2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.

2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.

2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.

2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.

2020 జనవరి 8: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.

2020 జనవరి 14 : సుప్రీంకోర్టు వినయ్ కుమార్ శర్మ, ముకేశ్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

2020 జనవరి 15 : దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు జనవరి 22న ఉరిశిక్ష వేయలేమని చెప్పింది. దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉందని చెప్పింది. 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాష్ట్రపతి వైపు నుంచి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా నిందితులకు కనీసం 14 రోజుల గడువు ఇవ్వడం తప్పనిసరి అని చెప్పింది.

2020 జనవరి 17 : ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి. కొత్త డెత్ వారెంట్ జారీ. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష విధించాలని ఆదేశం.

2020 జనవరి 28 : ముకేశ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

2020 జనవరి 31: దోషుల ఉరిశిక్షను తదుపరి ఆదేశాల వరకూ నిలుపుదల చేస్తున్నట్లు పటియాలా కోర్టు ప్రకటించింది.

2020 ఫిబ్రవరి 2: పటియాలా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

2020 ఫిబ్రవరి 17 : మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 2 : దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

2020 మార్చి 5 : మార్చి 20న ఉరి తీయాలని పాటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 19 : డెట్ వారెంట్‌పై స్టే విధించాలంటూ వేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు తిరస్కరించింది.

2020 మార్చి 20 : అర్థరాత్రి అత్యవసరంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దోషుల్లో ఒకరు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.

2020 మార్చి 20: తెల్లవారుజాము 5 : 30 గంటలకు దోషులు నలుగురినీ ఒకేసారి తీహార్ జైలు లో ఉరి తీశారు.

Tags:    

Similar News