ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఘట్కేసర్ జరిగింది. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చివేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు జనగామ జిల్లాకు చెందిన తల్లీకొడుకులుగా నిర్ధారించారు. వీరిని హత్య చేసి తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. వీరిని హత్య చేసింది మహిళ భర్తే అని అతడే ఒప్పుకున్నాడు. పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేష్, గూడూరుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు.
ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడిన శుశ్రుత కొద్ది రోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని భార్యను ఉప్పల్కు రమేశ్ పిలిపించాడు. కుమారుడితో కలిసి శుశ్రుత ఓఆర్ఆర్ వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన శుశ్రుత.. తాను నిద్రమాత్రలను మింగడమేగాక మరో మాత్రను పాలలో కలిపి కుమారుడికి తాగించింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న వారిని రమేష్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.