కుటుంబ కలహాల నేపథ్యంలో లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్లోని అడాజణ్లో జరిగింది. అడాజల్లోని పోలీస్ స్టేషన్కు సమీపంలో గల శివకుటీర్ అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ మాలిని(29)కి ఆరేళ్ల క్రితం డాక్టర్ చింతిత్ పటేల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య కలతలు రేగినట్టు తెలుస్తోంది. దాంతో విరక్తి చెందిన మాలిని ఆత్మహత్య చేసుకుంది.
చనిపోయేముందు ఒక సూసైడ్ లెటర్ రాసింది. అందులో తన భర్తను తన మృతదేహాన్ని తాకనీయవద్దని, అలాగే తన అంతిమ సంస్కారాలకు హాజరుకానీయవద్దని కోరింది. దీంతో మాలిని మృతదేహానికి ఆమె పుట్టింటివారు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తంచేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా డాక్టర్ చింతిత్ పటేల్ కుటుంబ సభ్యులు మాలినిని వేధింపులకు గురిచేసేవారనే ఆరోపణలున్నాయి.