పండగపూట పెనువిషాదం : చిన్నారిని చిదిమేసిన లారీ

Update: 2019-03-05 02:53 GMT

మహా శివరాత్రి పర్వదినం ఓ ఇంట్లో పెనువిషాదాన్ని నింపింది. తల్లిదండ్రుల ఎదుటే కూతురు దుర్మరణం పాలైంది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి–ఆనందపురం రోడ్డులో నల్లబిల్లి జంక్షన్‌లో సోమవారం జరిగింది. చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు సూర్యనారాయణ, వరలక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె జాహ్నవి(8) సంతానం. సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం కావడంతో జాహ్నవి అమ్మమ్మ విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి ఆటోలో చేరుకున్నారు.

అక్కడ ఆదివారం గడిపి సోమవారం ఉదయం తిరిగి గోపాలపట్నం వారి ఆటోలోనే తిరుగు పయనమయ్యారు. అయితే ఇంటి ముందు ఉన్న ఆటో ఎక్కేందుకు జాహ్నవి ప్రయత్నించగా అదే సమయంలో ఓ స్టోన్‌ క్రషర్‌ నుండి ఆనందపురం వైపు వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలిక లారీ వెనుక చక్రాల కింద పడి తల్లిదండ్రుల ఎదుటే జాహ్నవి దుర్మరణం పాలైంది.కళ్ళముందే కుమార్తె మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News