పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఖండ్లోని కుంతి జిల్లాలో జరిగింది. పోలీసుల చేతిలో నిషేధిత లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ)కి చెందిన ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. వీరుపీఎల్ఎఫ్ఐ.. సీపీఐ (మావోయిస్టు) సంస్థ నుంచి విడిపోయిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు.
కుంతి జిల్లాలోని ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 6.30 గంటలకు సీఆర్పీఎఫ్భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు మొదలయ్యాయని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్) ఆశిష్ బాత్రా తెలిపారు. కాల్పుల్లో పీఎల్ఎఫ్ఐకి చెందిన ఐదుగురు నక్సల్స్ మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించినట్టు ఆశిష్ బాత్రా వెల్లడించారు. కాగా ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి గాయాలు కాలేదని అన్నారు. మరణించిన నక్సల్స్లో ఏరియా కమాండర్ ప్రభు సహాయ్ బోద్ర ఉన్నారని, ఆయనపై రూ.2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఇక ఘటనా స్థలం నుంచి రెండు 315 తుపాకులు ఒక 9 ఎం.ఎం. పిస్టల్ , రెండు ఏకే 47 తుపాకులు, స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.