నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం ముందు టైరు చెన్నారం వద్ద పేలిపోయింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్లోని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని పదిహేను మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ముగ్గురిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు చనిపోయారు. మొత్తం 8 మంది మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో డ్రైవర్ మహేశ్తో పాటు గోవర్ధన్, ఆకుల శ్రీను, నీలా వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. నల్గొండ జిల్లా ఉన్నాతాధికారులతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.