న్యూజిలాండ్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో రక్తపుటేరులు పారించారు. శుక్రవారం వేళ రెండు మసీదుల్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో 49 మంది చనిపోయారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. న్యూజిలాండ్లో జరిగిన ఈ మారణహోమాన్నిప్రపంచ దేశాలన్నీ ఖండించాయి.
న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో అల్నూర్ మసీదులో 39 మంది చనిపోయారు. అటు లిన్వుడ్ అవెన్యూలోని మసీదులో మరో ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. అక్కడ మరో 10 మంది మరణించారు.శుక్రవారం కావడంతో ముస్లింలు ప్రార్థనల కోసం డీన్స్ అవెన్యూలోని అల్నూర్ మసీదులోకి వెళ్లారు. అందరూ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఓ దుండగుడు లోపలికి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఆటోమేటెడ్ రైఫిల్తో విచ్చలవిడిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. కనిపించిన వారందరిపైనా కాల్పులు జరిపి హతమార్చాడు. అంతేకాదు షర్ట్ బటన్కు కెమెరా అమర్చి మొత్తం దృశ్యాలను రికార్డ్ చేశాడు దుండగులు. ఆ వీడియోను ఫేస్బుక్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేశాడు. 15 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉగ్రదాడిపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆడర్న్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. న్యూజిలాండ్కు ఇది చీకటి రోజని ఆమె అన్నారు.
న్యూజిలాండ్ మసీదుల్లో దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మసీదు దగ్గర కాల్పులకు తెగబడిన దుండగుడు తమ దేశానికి చెందిన వ్యక్తి అని, అతడు అతివాద భావజాలానికి ప్రేరేపితుడైన తీవ్రమైన ఉగ్రవాది అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు.