ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు ఓ 60 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా కాల్చిచంపారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన మీరట్లో జరిగింది. 60ఏళ్ల వృద్ధురాలు నిచేత్తర్ కౌర్ మరో మహిళతో కలిసి మంచంపై కూర్చుని కబుర్లు చెప్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ముగ్గురు యువకులు తుపాకులతో వచ్చి నిచేత్తర్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి ఏకంగా పది బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి పక్కనే ఉన్న మహిళను మాత్రం పారిపోమన్నారు. ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక దుండగులు ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులేసుకున్నారు.
దుండగులు అంతటితో ఆగకుండా ఆమె కుమారుడిని కూడా కాల్చిచంపారు. 2016లో నిచేత్తర్ కౌర్ భర్తను భూవివాదం నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి నిచేత్తర్, కుమారుడు బల్వీందర్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కోర్టుకు హాజరవడానికి ఒక్కరోజు ముందు ఇద్దరూ హత్యకు గురికావడంతో ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.