ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై గ్యాంగ్రేప్నకు పాల్పడ్డ దుండగులు ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా గున్నార్ ప్రాంతం పాతక్పూర్లో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. రాజ్పుర పోలీసు స్టేషన్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ, ఇద్దరు పిల్లలతో ఉంటుండగా.. ఆమె భర్త ఘజియాబాద్లో కూలీగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆ మహిళ నిద్రిస్తుండగా ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. సమీప బంధువుకు ఫోన్ చేసిన బాధిత మహిళ తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. అతను పోలీసులకు సమాచారం అందించేలోపే తిరిగొచ్చిన ఆ ఐదుగురు.. సదరు మహిళను స్థానిక గుడి వద్దకు లాక్కెళ్లి యాగశాలలో పడేసి ఒంటికి నిప్పుపెట్టారు. మృతురాలి భర్త, సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, మృతురాలు తన బంధువుతో చివరిసారిగా మాట్లాడిన ఆడియో క్లిప్ ఆధారంగా నిందితులను గుర్తించామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రేమ్ ప్రకాశ్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.