ఎవరీ సూరీ... భాను ఎందుకు చంపాల్సి వచ్చింది!!

Update: 2018-12-18 05:54 GMT

రక్తచరిత్ర సినిమా పేరు వింటేనే అందరీకి ముందుగా గుర్తుకు వచ్చేది అనంతపురం ఫ్యాక్షనిజమే. పరిటాలరవి, సూరిల మధ్య వైరమే ఈ సినిమా కథ. రక్తచరిత్ర రాకముందు పరిటాల దారుణహత్యకు గురికాగా, ఆతర్వాత సూరి మర్డర్ అయ్యాడు. సూరి హత్య కేసు తీర్పును ఇవాళ నాంపల్లి కోర్టు వెలువరించనుంది. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానును కోర్టుగా దోషిగా తేల్చనుందా లేదా నిర్దోషిగా విడుదల చేయనుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మద్దెలచెరువు సూరి అలియాస్ సూర్యనారాయణరెడ్డి  2011 జనవరి 3న హైదరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ హత్య సంచలనం సృష్టించింది. సూరి హత్య కేసు విచారణ నాంపల్లి కోర్టులో  ఏడేళ్ల నుంచి కొనసాగుతోంది. సూరి హత్య కేసులో  ప్రధాన నిందితుడు గా ఉన్న భాను కిరణ్ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనేక సాక్ష్యలు సేకరించిన సీఐడీ పోలీసులు..
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన సూరి డ్రైవర్ మధు వాంగ్మూలంతో పాటు పోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును నాంపల్లి కోర్టుకు సమర్పించారు. 

పోలీసులకు సూరి డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం ఈ విధంగా ఉంది. జూబ్లిహిల్స్ నుంచి బయలుదేరి సూరి, డ్రైవర్ మధు  సనత్ నగర్ లో ఒక అడ్వకేట్ ను కలిశారు. తర్వాత అక్కడి నుంచి  స్కొడా కారులో భానుతో కలిసి బయలుదేరారు. ముందు సీట్లో సూరి వెనుక సీట్లో భాను కూర్చున్నారు. నవోదయ కాలనీకి చేరుకుంటున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో కారు స్లోను చేశారు.  ఒక్కసారిగా కారులో  కాల్పుల శబ్దం వచ్చింది. సూరి సిగరెట్ తాగుతూ డ్రైవర్ భుజంపై ఒరిగాడు.  వెనుక సీట్లో కూర్చున్న  భాను అటాక్ అటాక్ అని అరుస్తూ కారు దిగి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలైన సూరిని కారులో అపోలో హస్సిటల్ కు డ్రైవర్ మధు తరలించారు.  ఆ తర్వాత భానుకు మధు ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. 

ఫోరెన్సీక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టులో పాయింట్ బ్లాక్ లోనే సూరిపై కాల్పులు జరిగాయని రిపోర్టు  వచ్చింది. పాయింట్ బ్లాక్ లో కాల్పులు జరిపే అవకాశం ఒక్క భానుకు మాత్రమే ఉందన్నారు సిఐడి పోలీసులు. ఐ విట్నెస్ మధు హత్య ఎవరుచేశారో స్పష్టంగా చెప్పకపోవడం! హత్యకు ఉపయోగించిన పిస్తోల్  రెండేళ్ల  తర్వాత పోలీసుకు దొరకడంతో వేలిముద్రలు  స్పష్టంగా లభించలేదు. సూరి హత్యకు సహకరించినట్టుగా భానును తప్ప ఏ ఒక్కరిని ఆధారాలతో బోనులో నిలబెట్టలేదు. కేవలం ఫోరెన్సిక్  రిపోర్టు ఆధారంగానే భాను హత్య చేశాడని కోర్టు పరిగణిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. సూరిని భానే హత్య చేశాడని సూరి సతీమణి భానుమతి చెబుతున్నారు. భానుకి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తన భర్తను పరిటాల రవి కుటుంబం హత్య చేయించిందని భానుమతి ఆరోపిస్తున్నారు. సూరి హత్య కేసులో అరెస్ట్ అయిన భాను  బెయిల్ కు అప్పీల్ చేయకుండా జైల్లోనే ఉంటున్నాడు. సూరి హత్య కేసును ఏడేళ్ల పాటు విచారించిన నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానిపై  రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Similar News