అప్పు తీర్చమన్నందుకు ఒక యువకుడిని చావగొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలో జరిగింది. ఓ యువకుడు నాసిర్ అన్సారీ అనే వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా అప్పు తీర్చకుండా లేట్ చేయడంతో ఆ యువకుడు నాసిర్ అన్సారీని నిలదీశాడు. గొడవ పెరగడంతో నాసిర్ పై చేయి చేసుకున్నాడు సదరు యువకుడు. దీంతో కోపం పెంచుకున్న నాసిర్ అన్సారీ తన స్నేహితులతో కలసి ప్లాన్ చేసి ఆ యువకుడిని చితక్కొట్టారు.
గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అతి దారుణంగా కొట్టారు. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. మరికొందరు వీడియో తీస్తూ ఆనందించారే తప్ప వద్దంటూ వారించలేదు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయం పోలీసుల వరకు వెళ్లింది. బాధితుడిని పిలిపించి వివరాలు కనుక్కుని FIR రిజిస్టర్ చేశారు పోలీసులు. కీలక నిందితుడు నాసిర్ అన్సారీని అరెస్ట్ చేయగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు దేవరియా పోలీసులు చెప్పారు.