ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ విద్యార్థికి స్వయంగా తన చేతుల మీదుగా ఇచ్చిన చెక్ చెల్లకుండా పోయింది. దీంతో బ్యాంకుకు వెళ్లిన విద్యార్థికి నిరాశే ఎదురైంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్కు చెందిన అలోక్ మిశ్రాకు టెన్త్క్లాస్ పరీక్షల్లో రాష్ట్రంలో ఏడో ర్యాంకు సాధించాడు. అతని ప్రతిభను గుర్తించిన యూపీ సర్కార్ అలోక్ను అభినందించింది. ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించేందుకు లక్నోలో ఓ సమావేశంలో సీఎం ఆదిత్యనాథ్ స్వయంగా లక్ష రూపాయల చెక్ను అలోక్కు ప్రదానం చేశారు. లక్ష రూపాయలు వచ్చిన ఆనందంలో అలోక్ సీఎం అందించిన చెక్ను జూన్ 5న హజ్రత్గంజ్లోని దేనా బ్యాంకులో వేశాడు. చెక్ క్లియర్ అయి డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశాడు. కానీ అకౌంట్లో డబ్బులు రాకపోగా అతనికి పెనాల్టీ పడింది. దాంతో డబ్బులు పడతాయని ఆశించిన విద్యార్థి షాక్ కు గురయ్యాడు. వెంటనే తలిదండ్రులతో కలిసి అధికారులను కలిస్తే జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ యాదవ్ చెక్పై చేసిన సంతకంలో తేడా ఉండటంతోనే బౌన్స్ అయిందని చెప్పారు. కాగా దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయింది.