జమ్ము కాశ్మీర్లోలో ఉగ్రవాదులు మరోసారి దొంగదెబ్బ తీశారు. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా నుంచి గురువారం రాత్రి కిడ్నాప్ చేసి తీసికెళ్లిన ముగ్గురు స్పెషల్ పోలీస్ అధికారులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. షోపియాన్లో ఈ ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడింది. జమ్మూకశ్మీర్లో పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా అనుమానిస్తున్నారు.
సుమారు 10 మంది ఉగ్రవాదులు గత రాత్రి కప్రిన్, బాటగుండ్ గ్రామాల నుంచి ముగ్గురు ఎస్పీఓలు, ఒక పోలీసును అపహరించుకు వెళ్లారు. కిడ్నాపైన అధికారులు ఆన్ డ్యూటీలో లేకపోయినా పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని కిడ్నాప్ చేశారు. అపహరించిన సమయంలో ఉద్యోగాలు వదులుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే న్యూయార్క్లో విదేశాంగ మంత్రుల సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన విజ్ఞప్తికి భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మరుసటి రోజే ఉగ్రవాదులు చెలరేగిపోవడం, పాశవికంగా ముగ్గురు ఎస్పీఓలను హత్య చేయడం సంచలనమవుతోంది.
మరోవైపు ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా పోలీసులను హత్య చేయడాన్ని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఖండించారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బలప్రయోగంతో ఏదైనా సాధించవచ్చన్న కేంద్ర విధానం ఏమాత్రం పనిచేయడం లేదని చర్చలే దీనికి ఏకైక పరిష్కారమన్నారు. ఉగ్రవాదుల బుల్లెట్లకు మరో ముగ్గురు పోలీసులు బలయ్యారంటూ ఓ ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు.