తెలుగు స్టేట్స్‌... సైక్లోన్‌ అలర్ట్‌! దంచికొడుతాయట వానలు!!

Update: 2018-10-09 10:02 GMT

దక్షణాది రాష్ట్రాలతో పాటు తెలుగురాష్ట్రాల్లో రెండ్రోజుల్లో రెండు తుపాన్లు విరుచుపడనున్నాయి. వరుసగా రెండు తుఫాన్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా వుంటుందోనంటూ అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. తుపాన్ల ప్రభావంతో  భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రజలు  ఉలిక్కిపడుతున్నారు. 

భారీ వర్షాలు పలురాష్ట్రాలతో పాటు తెలుగురాష్ట్రాలను అతలకుతం చేయనున్నాయి. .అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో తుఫాన్లు అలజడి సృష్టిస్తున్నాయి. తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి లుబన్ అని నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒమన్‌ తీరం దిశగా కదులుతోంది. రానున్న ఐదు రోజుల్లో ఒమన్‌ పరిసరాల్లో తీరం దాటే క్రమంలో తీవ్ర పెనుతుఫానుగా మరింత బలపడనుంది. దీని ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. తుఫానుగా మారిన తర్వాత ఒమన్ యెమెన్ తీరాలను దాటుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరప్రాంతాలను నేవీ అలర్ట్ చేసింది. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తోంది. కేరళ , లక్షద్వీప్ మినికాయ్ ద్వీపం, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో నౌకలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మోహరించి ఉన్నాయని  అధికారులు తెలిపారు. 

ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది మరింత బలపడి ఈనెల 10నాటికి తుఫానుగా మారనుంది. దీనికి టిట్లీ అని నామకరణం చేయనున్నారు. ఈ పేరును పాకిస్థాన్‌ సూచించింది.రెండు సముద్రాల్లో ఒకేసారి తుఫాన్లు రావడం అప్పుడప్పుడు జరుగుతుంటుందని వాతావరణ నిపుణుడు చెబుతున్నారు. ఇలా ఒకేసారి రావడం వల్ల రెండు తుఫాన్లు బలపడతాయని.. తీరందాటే సమయంలో ఎక్కువ ప్రభావం చూపుతాయని తెలిపారు. రెండు తుపాన్లు ఏర్పడం వల్ల సముద్రం  అల్లకల్లోలంగా ఉందని... దీని తీవ్రత మరింత పెరుగుతుందని...మత్స్యకారులు  వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది తుఫాన్ హెచ్చరికల కేంద్రం. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించింది.

Similar News