గాంధీ భవన్లో పీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశం వాడివేడిగా జరిగింది. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే పార్టీలో చేరినవారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే మౌనంగా ఉంటున్నారని సీరియస్ అయ్యారు.
టీపీసీసీ కార్యవర్గ సమావేశం హాట్ హాట్గా జరిగింది. పార్టీలో పలువురు నాయకుల తీరును సమావేశంలో ఎండగట్టారు. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులను తప్పుపడుతూ విడుదలైన కరపత్రాలు కలకలం సృష్టించాయి. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించకపోవడంపై సీనియర్ నేత వీహెచ్, మాజీ మంత్రి దానం నాగేందర్ అసంతృప్తి గళం వినిపించారు.
ఈ మౌనం పార్టీకి నష్టమని..ఈ కరపత్రాల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోకుండా ఉండటాన్ని వారు ప్రశ్నించినట్లు సమాచారం. సీనియర్ నేతల ఆగ్రహాన్ని గుర్తించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరపత్రాల వెనుక ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకుంటామని వారిని శాంతింపచేసిన్నట్లు తెలుస్తోంది.
పార్టీలో ఇటీవలే చేరిన కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వారిని నియంత్రించకపోగా మరింత ప్రోత్సహించడంపై నేతలు మండిపడినట్లు సమాచారం. ఇటీవల నెక్లెస్ రోడ్లో జరిగిన కాండిల్ ర్యాలీకి ఎవరు సరిగా సహకరించలేదని దానం అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని పీసీసీ చీఫ్కు సూచించినట్లు తెలుస్తోంది.