టీడీపీ ఎంపీలకు శుక్రవారం విచిత్రమైన అనుభవం ఎదురైంది. లోక్ సభ స్పీకర్ కార్యాలయం తమను తప్పుదారి పట్టించడంతో వారు ఖంగుతిన్నారు. ఈరోజు లోక్సభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ తెదేపా ఎంపీలు బయటకు వెళ్లకుండా ప్రధానమంత్రి కుర్చీ వద్ద ఆందోళన చేపట్టారు. భద్రతా వారించినప్పటికీ వారు వినిపించుకోలేదు. గంటకు పైగా ఆందోళన కొనసాగిన అనంతరం భద్రతా సిబ్బంది వచ్చి.. స్పీకర్ మీతో మాట్లాడతానని చెప్పారని, కార్యాలయానికి రావాలంటూ సందేశం పంపారని ఎంపీలతో చెప్పారు. వారి మాటలు నమ్మిన తెదేపా ఎంపీలు స్పీకర్ కార్యాలయం వద్దకు వెళ్లగానే భద్రతా సిబ్బంది లోక్సభ తలుపులు మూసివేశారు. తీరా ఎంపీలంతా స్పీకర్ కార్యాలయం వద్దకు వెళ్లగా ఆమె అప్పటికే వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో అవాక్కయిన టీడీపీ ఎంపీలు స్పీకర్ కార్యాలయ సిబ్బంది తీరుకు నిరసనగా అక్కడే ఆందోళనకు దిగారు.