పాస్‌పోర్ట్‌ ఇక మరింత సులభం

Update: 2018-06-26 11:39 GMT

పాస్‌‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ‘పాస్‌పోర్టు సేవా దివస్’ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ ‘పాస్‌పోర్ట్ సేవా’ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాజా యాప్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ దరఖాస్తును దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చని, మొబైల్‌ ఫోన్ల నుంచే పాస్‌పోర్ట్‌ దరఖాస్తును నింపవచ్చని చెప్పారు. నూతన పథకాల ద్వారా పాస్‌పోర్ట్‌ విప్లవం చోటుచేసుకుందని మంత్రి అభివర్ణించారు.

హజ్‌ యాత్రకు వెళ్లే వందలాది భారత పౌరులకు సరళీకరించిన నూతన పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సులభతరంగా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల సంఖ్యను పెంచామని, ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో 38 అదనపు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 260 పాస్‌పోర్ట్‌ కేంద్రాలు పనిచేస్తుండగా, త్వరలో వాటిని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ ప్రభుత్వం విస్తరిస్తుందన్నారు. 

Similar News