అలనాటి బాలీవుడ్ నటుడు శశికపూర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శశికపూర్ కూతురు సంజనా కపూర్కి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. శశికపూర్కు తాను వీరాభిమానినని, తాను, రాజీవ్ కలిసి ఇంగ్లండ్లో తొలిసారి శశికపూర్ సినిమా చూశామని ఆ లేఖలో పేర్కొన్నారు.
‘మీ నాన్న చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. శశికపూర్ నటించిన తొలి చిత్రం ‘షేక్స్పియర్వాలా’ చూసి ఆయనకి అభిమానినయ్యాను. ఈ సినిమాని 1966లో ఇంగ్లాండ్లో చూసినట్లు గుర్తు. ఆ సినిమా చూడటం మర్చిపోలేని అనుభవం. ఇందుకు కారణం సినిమా అద్భుతంగా ఉండటమేకాదు రాజీవ్ నన్ను ఈ సినిమాకి తీసుకెళ్లారు. ఆ తర్వాత శశి కపూర్ నటించిన చాలా చిత్రాలు చూశాను. గొప్ప నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. అది వెండితెరపై అయినా.. చిన్న ఆర్ట్ సినిమాలైనా. ఆ మధురమైన సినిమాలు మనకు శశి ఇచ్చిన గొప్ప కానుక. ఎలాంటి పాత్ర కోసమైనా కష్టపడి పనిచేసేవారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి.’ అని సోనియా లేఖలో పేర్కొన్నారు.