మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేదిక నుంచి జారి పడిపోయారు. తన 'జన ఆశీర్వాద్ యాత్ర'లో భాగంగా నిన్న రాత్రి ఛటర్ పూర్ జిల్లా చంద్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తన ప్రసంగం తరువాత వేదిక దిగుతూ కాలుజారి దబ్బున కిందపడ్డారు. వేదిక నుంచి దిగుతున్న ఆయన మెట్లను గమనించక పోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆయన పడుతుంటేనే అప్రమత్తమైన కార్యకర్తలు, భద్రతా సిబ్బంది పూర్తిగా కింద పడిపోకుండా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెట్టు ఉందనుకుని పక్కన కాలు మోపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. త్వరలో మధ్యప్రదేశ్ కు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'జన ఆశీర్వాద్ యాత్ర' పేరిట ఆయన వరుస పర్యటనలు చేస్తూ, ప్రజల్లో గడుపుతున్నారు.